14, డిసెంబర్ 2014, ఆదివారం

8. వర్ణాలంటే అక్షరాలేనా, బేధం ఏమన్నా ఉందా?

వర్ణాలూ అక్షరాలూ ఒకటేనా వేరువేరా అన్నది చాలా ఉచితమైన ప్రశ్న.

ఇప్పటికే  శ్రీ జై గొట్టిముక్కల వారు అడిగారు కూడా వర్ణాలు అక్షరాలూ ఒకటేనా? కాకపొతే తేడా కాస్త విపులంగా చెప్పగలరా? అని. దానికి నేను సమాధానం చెప్పటం జరిగింది.

కాని ఈ ప్రశ్నోత్తరాలు రెండూ ఒక టపాకు వ్యాఖ్యలుగా ఉన్నాయి కాబట్టి ఎవరైనా వాటిని గమనించకపోయే అవకాశం కూడా ఉంది. ఐనా నిజానికి వ్యాఖ్యలను చూసి బ్లాగు టపాల వద్దకు చదువరులు రావటం అంతకంటే సహజం. ఒక వేళ ఎవరూ అందరూ ప్రశ్నోత్తరాలను గమనించినా, ఈ ప్రశ్నకు కొంచెం విస్తృతంగా జవాబును చెప్పుకొనే అవకాశం ఉంది కాబట్టి ఒక పూర్తి నిడివి టపాగా వ్రాయాలన్న ఆలోచన కలిగింది.  అలా చేస్తే చదువరులకు సంగతి సంధర్భాలు సమగ్రంగా బోదపడేందుకు చక్కని వీలు కలుగుతుందన్నది నా ఊహ.

భారతీయమైన సనాతన భావనాస్రవంతిలో శబ్దము బ్రహ్మము అని చెప్పబడుతుంది. ముందుగా ఈ విషయంలో కొంత వివేచన చేయటం అవసరం.

భర్తృహరి వాక్యపదీయంలోని బ్రహ్మకాండలో,

అనాది నిధనం, బ్రహ్మశబ్ద తత్త్వం యదక్షరమ్
వివర్తతేర్థభావేన ప్రక్తియా జగతో యతః

అని చెప్పాడు. అంటే సకలప్రపంచం యొక్క వ్యవహారమూ దేనివల్ల కలుగుతోందో, ఆ అర్థ-భావాలని ప్రపంచంలొ వ్యాపించచేసేది శబ్ద తత్త్వం. ఆ శబ్దతత్త్వం కేవలం బ్రహ్మమే. అది నాశనము లేనిది. గుణములూ రూపములు అనేవాటితో ప్రకృతి యేర్పడింది. ఆ ప్రకృతికి మూలం‌ బ్రహ్మమే. అదే ఆ ప్రపంచంలో వ్యవహారాలు జరిగేటందుకు గాను శబ్దం అనే తత్త్వంగా వ్యాపించి ఉంది.

సంస్కృతభాషకు ప్రామాణికి వ్యాకరణం రచించిన పాణిని మహర్షి తన వ్యాకరణగ్రంథం అష్టాధ్యాయిలో ఈ‌ శబ్దము బ్రహ్మమే అన్న సిధ్ధాంతాన్ని వ్యక్తీకరించారు.

మహర్షి పతంజలి పాణిని వ్యాకరణానికి ఒక గొప్ప భాష్యగ్రంథాన్ని రచించారు. దానికి మహాభాష్యం అని పేరు. పతంజలి మహర్షి ఆదిశేషుడి అవతారమని ప్రతీతి.  ఆయన రచించిన ఆ మహాభాష్యంలో ఈ శబ్దము అనేది బ్రహ్మమే అని నొక్కి వక్కాణించాడు. ఆయన,  ప్రతిమండితో‌ బ్రహ్మరాశిః అంటూ, వర్ణసమామ్నాయం అంతా బ్రహ్మమే అని నిర్దారించారు.  కిం పునర్నిత్యః శబ్దః ఆహాస్విత్ కార్యః అని నిత్యమూ సకలకార్యాల నిర్వహణకూ ఆధారమైన ఈ శబ్దతత్త్వము బ్రహ్మమే అన్నారు.

బ్రహ్మ సూత్రాల్లో కూడా ఈ‌క్షతేర్నాఽశబ్దం అని చెప్పబడింది.

యత్కించిత్ నాదరూపేణ శ్రూయతే శక్తిరేవచ
యస్తత్వాంతో నిరాకారాః స ఏవ పరమేశ్వరః

కేవలం శ్రోత్రేంద్రియానికి గోచరంగా ఉంటూ ఒక ఆకారం లేనిదీ నాదరూపంలో ప్రత్యక్షమాణం అవుతున్నదీ ఏదైతే ఉందో ఆ శక్తిస్వరూపం కేవలం పరమేశ్వరుడే అని దీని తాత్పర్యం.

చైతన్యం సర్వభూతానాం శబ్దబ్రహ్మేతిమే మతిః అని శారదాతిలకం.

ఈ విధంగా భారతీయమైన దృక్పధంలో శబ్దం అనేది బ్రహ్మస్వరూపంగా అర్థం చేసుకోవలసి ఉంది.  ఈ శబ్దం పరా, పశ్యంతీ, మధ్యమా, వైఖరీ అని నాలుగు విధాలుగా ఉంటుంది.

శబ్దానికి ఇఛ్ఛ మూలం.  అదే దాని 'పర' అవస్థ.. ప్రపంచోన్ముఖంగా అంటే లోనుండి బయటకు రావటాఅనికి ప్రయత్నరూపంలో ఉన్న శబ్దానిది 'పశ్యంతి; అవస్థ, వాగ్రూపం ధరిస్తున్న శబ్దం 'మధ్యమ' అనే అవస్థలో‌ ఉంటుంది. వర్ణములు స్థూలాకృతి కలవి.  ఇలా వర్ణాల రూపంలో ఉండటం, శబ్దానికి వైఖరీ అవస్థ. దీనివలన వాక్కు క్రియాశీలంగా ఉండటం వల్లనే ప్రపంచవ్యవహారాలు నడుస్తున్నాయి.

ఈ విధంగా శబ్దం ధ్వనిరూపంగా వైఖరీస్థితిలో ప్రపంచంలో వ్యాప్తి చెందుతోంది. అప్పుడే మనకి మాటలూ వాటి అర్థాలూ అన్న గ్రహింపుకు వస్తున్నాయి.  ఇలా ఈ ప్రపంచవ్యవహారం వర్ణాత్మకం అవుతోంది,

ఈ శబ్దము అనే బ్రహ్మము వైఖరీ అవస్థలో వివిధమైన వర్ణాలుగా కనిపిస్తోందని చెప్పుకున్నాం‌ కదా. ఆ వర్ణములే వర్ణమాలలో ఉన్న వర్ణాలు. అంటే వర్ణమాలలో ఉన్న ఒక్కక్కొ వర్ణమూ ఒక్కొక్క శబ్దవిశేషం అన్నమాట.

ఈ వర్ణాలని గురించి శాస్త్రంలో విషృతంగా ఉంది కాని మనం కొంచెంగానే పరిశీలిధ్దాం.  లలితా సహస్రనామస్తోత్రంలో 'ఆదిక్షాంత సమస్తవర్ణజననీ' అని ఒక మంత్రం ఉంది.  (అక్కడి నామా లన్నీ‌ మంత్రాలే. అది వేరే విషయం).  అంటే అకారం నుండి క్షకారం వరకూ అన్ని వర్ణాలకూ అమ్మ మాతృమూర్తి అని చెబుతున్నదీ మంత్రం.  ఇక్కడ మనకి ఆసక్తి ఉన్న విషయం అకారం నుండి క్షకారం వరకూ అన్నీ వర్ణములు అన్న తెలివిడి.

సరే ఇప్పుడు వర్ణము అంటె శబ్దము యొక్క నిర్దిష్టమైన అభివ్యక్తీకరణ అని తెలిసింది. ఎన్ని రకాల వ్యక్తీక్రరణలు ఉన్నాయో అన్ని వర్ణములు ఉన్నాయి.

అక్షరం అనేది ఏమిటి అన్నదానికి సమాధానం సులభమే. అది ఇప్పటికే చెప్పాను. వర్ణము యొక్క లిఖితస్వరూపం అక్షరం.  నిజానికి యిది నూటికి నూరుపాళ్ళూ సంతృప్తికరమైన నిర్వచనం కాదు కాని వ్యవహారానికి సరిపోయే నిర్వచనం. నిక్కచ్చిగా చెప్పుకోవాలంటే అక్షరం అన్నది వర్ణము యొక్క స్వభావం. వర్ణము శాశ్వతమైనది అన్న భావనతో వర్ణాలను అక్షరాలు అన్నారు.  అక్షరము అంటే క్షరము (నాశనము)‌లేనిది అని అర్థం కాబట్టి అలా చెప్పారు. స్థూలంగా కంటికి కనిపించే స్వరూపంలో అక్షరం అని వినిపించే స్వరూపంలో వర్ణము అని అంటే సరిగా ఉంటుంది.  అంటే ప్రతివర్ణం యొక్క వ్యక్తీకరణకీ ఒక రూపం ఆపాదిస్తే అది ఆ వర్ణానికి అక్షరం అన్నమాట.

వచ్చే ఒకటి రెండు టపాల్లో వర్ణమాలలో ఉన్న ఋ ౠ ఌ ౡ లకు సంబంధించీ, క్ష అనేదాని ప్రతిపత్తికి సంబంధించీ వివరంగా తెలుసుకుందం. ఈ మధ్యకాలంలో కొందరు ఋ, ౠ, ఌ, ౡ లను వర్ణమాల నుంచి తీసెయ్యాలని గడబిడ చేస్తున్నారు. అలాగే క్ష అనేది వర్ణమాలలో ఉందని కూడా కొందరు వాదిస్తున్నారు.  ఈ వాదనలను శాస్త్రీయంగా పరిశీలించి ముందుకు కదులుదాం.  ఒక్క విషయం శాస్త్రీయంగా అంటే సంప్రదాయిక వ్యాకరనాది శాస్త్రాల ఆధారంగానే అని నా ఉద్దేశంగా గ్రహించండి.

3 కామెంట్‌లు:

  1. ఆర్యా నమస్తే

    "క్" (పొల్లు హల్లు) వర్ణమా? అక్షరమా? రెండునా?
    "క" వర్ణము అక్షరము రెండునా?
    "అమ్మ" అనే పదంలో అక్షరాల సంఖ్య 2 అనుకుంటే వర్ణాలు కూడా రెండేనా?
    బాలవ్యాకరణం 1వ సూత్రంకు అంబడిపూడి నాగభూషణం గారి
    అర్థ దీపిక.....

    వాక్యాలు పదాలుగా ,పదాలు అక్షరాలు,అక్షరాలు
    వర్ణాలుగా విడిపోతాయని ఉంది.

    "అమ్మ"అనే పదంలో అక్షరాలు 2
    వర్ణాలు 4 (అ+మ్+మ్+అ ) కరెక్టేనా చెప్పగలరు...
    ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి