6, డిసెంబర్ 2014, శనివారం

2. ప్రాకృత భాషకు 40 వర్ణాలు

[ పరవస్తు చిన్నయసూరిగారి బాలవ్యాకరణం.  సంజ్ఞాపరిఛ్ఛేదం.  సూత్రం -2 ]

ప్రాకృతమునకు వర్ణములు నలుబది.

ప్రాకృత భాషకి 40 వర్ణాలు

సంస్కృతభాషలో ఉన్న వర్ణాలు కొన్ని ప్రాకృత భాషలో లేవు.

సంస్కృతవర్ణమాలలో ఉండి ప్రాకృతంలోని వంటి అక్షరాలను నల్లగా కాక పటవర్ణాని దగ్గరలో క్రింద పట్టీల్లో ఋ లాగా చూపాను.

ప్రాకృతభాష వర్ణమాలను క్రింద ఇచ్చిన పట్టికలలో చూడండి.


అంఅః

ఙ 



అచ్చులు సంస్కృతంలో 16 ఉంటే వాటిలో  6 ఎగిరిపోయి 10 మాత్రమే ప్రాకృతంలో ఉన్నాయి.
అలాగే హల్లుల్లో  సంస్కృతంలో 34 ఉంటే వాటిలో4 ఎగిరిపోయి 30 మాత్రలో ప్రాకృతంలో ఉన్నాయి.

నిజానికి మనం చెప్పుకోవలసిన క్రమంలో చెప్పుకుంటే,
అచ్చులు ప్రాకృతంలో 10 ఉంటే వాటికి మరొక  6 చేరి  సంస్కృతంలో 16  అచ్చులు ఉన్నాయి.
అలాగే హల్లుల్లో  ప్రాకృతంలో 30 ఉంటే వాటిలో 4 చేరి  సంస్కృతంలో 34 హల్లులు ఉన్నాయి.

అసలు ప్రాకృతం అంటే అదే భాష?

ఈ విషయంలో ఒక శ్లోకం ఉంది.

షడ్విధేయం ప్రాకృతిశ్చ శూరసేనీచ మాగధీ
పైశాచీ చూళికా పైశాచ్యపభ్రంశ ఇతిక్రమాత్

అని. అంటే ప్రాకృతం అనేది ఆరు రకాలుగా ఉంది.  ఈ భాషలు

  1. ప్రాకృతం
  2. శూరసేని
  3. మాగథి
  4. పైశాచి
  5. చూళిక
  6. అపభ్రంశ పైశాచి 

అనేవి.  దీనిని బట్టి తెలిసేది ఏమిటంటే ప్రాకృతం అంటే అప్పటికి వ్యవహారంలో ఉన్న వాడుక భాష.  దీనికి మరొక ఐదురకాల మాండలికాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఆరు విధాలుగా వ్యావహరిక భాష ఉండేది. కాని ఇలా సంస్కృతంలో అదనంగా కొన్ని అచ్చులూ హల్లులూ‌ చేరాయని చెప్పటం‌ బదులుగా, ఈ బాలవ్యాకరణం సూత్రక్రమాన్ని అనుసరించి ప్రాకృతంలో కొన్ని తగ్గాయి అని చెప్పుకోవటం.

ఈ ప్రాకృతాన్ని సంస్కరించటం ద్వారా ఒక  సమగ్రభాషాస్వరూపం ఏర్పడింది. అలా ఏర్పడిన భాషకే సంస్కృతం (సంస్కరించబడినది) అని పేరు.

ప్రాకృత భాషలోనూ కవిత్వం ఉంది. అది మర్చిపోకూడదు.
అలాగే గుణాఢ్యుడు అనే మహాకవి బృహత్కథ అనే గొప్ప గ్రంథాన్ని ప్రాకృతంలోనీ పైశాచీ మాండలికంలో వ్రాసాడు.

ఈ సూత్రానికి వివరణ వ్రాస్తూ సూరిగారు ఇలా అన్నారు.
కొందఱ మతంబున హ్రస్వ వక్రంబులును బ్రాకృతమునందుఁ గలవు. 
కొందఱ మతంబున వక్రతమంబులుం గలవు.
ఎ ఏ ఒ ఓ లు వక్రములని, ఐ ఔ లు వక్రతమంబులని, ప్రాచీనులు వ్యవహరింతురు.

( హ్రస్వవక్రములు అంటే వక్రములలోని ఎ ఒ లు. )

ప్రాకృతంలో కనిపిస్తున్న ఎక్కో, కైతవం, కైఱవం వంటి కొన్ని మాటల ఆధారంగా ఇలాంటి వాదనలు ఉన్నాయి.

ఈ హ్రస్వవక్రములు, వక్రములు వక్రతమములు అనే మాటలను నన్నయాదులు వాడారు. ఈ సంజ్ఞలు ఆంధ్రశబ్ద చింతామణిలో కనిపిస్తున్నాయి. ఈ ఆంధ్రశబ్ద చింతామణి అన్నది సంస్కృతంలో వ్రాయబడిన తెలుగు వ్యాకరణం. దీనిని విరచించింది నన్నమభట్టు గారు. ఈ ఆంధ్ర శబ్ద చింతామణికి నన్నయభట్టీయము అనీ, శబ్దాను శాసనము అనీ, వాగనుశాసనీయము అనీ కూడా వ్యవహార నామాలున్నాయి.  నన్నయగారికి వాగనుశాసనుడనీ, శబ్దశాసనుడనీ బిరుదులున్నాయి కాదా, అవి ఈ వ్యాకరణం వ్రాయటం వలన వచ్చి ఉండవచ్చును. లేదా ఆయనకు ఉన్న బిరుదుల కారణంగా ఆంధ్రశబ్ద చింతామణికే ఆ బిరుదులూ వ్యవహార నామాలు కావచ్చును. మనకి స్పష్టంగా తెలియదు.

ఈ ఆంధ్రశబ్ద చింతామణిలో 270దాకా శ్లోకాలున్నాయి. వివరాలు అప్రస్తుతం కాని ఒక్క మాట. అతిప్రసిధ్దమైన నానుడి

విశ్వ శ్రేయః కావ్యమ్‌

అన్న మాట ఉందే అది ఆంధ్రశబ్ద చింతామణిలోనిదే. అది ఆ గ్రంథంలో మొదటి సూత్రం! విశ్వానికి శ్రేయస్సు కూర్చేదే కావ్యం అని దీని భావం. ఎంత ఉదాత్త భావన!

అంతే కాదు మరిక అందమైన అందరికీ, ముఖ్యంగా నేటి తరాల తెలుగువారికి బాగా నచ్చే ముక్కనూ ఆ నన్నయ్యగారి ఆంద్రశబ్ద చింతామణి గ్రంథమే మొట్టమొదటగా ప్రకటించింది.

సిద్ధిర్లోకాద్దృశ్యా

అని. అంటే లోకవ్యవహారం నుండే శబ్దాల స్వరూపం సిధ్దిస్తుంది అని దీని అర్థం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి